కలం, కరీంనగర్ బ్యూరో: పోలీస్ కమిషనరేట్ కార్యాలయం (Police Commissionerate)లో మరణించిన సిబ్బంది పేర్లతో జీతాలు డ్రా చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కాజేస్తున్న భారీ కుంభకోణాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు వెలికితీశారు. సుమారు రూ. 1,40,18,308 మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ విచారణలో తేలింది. గతంలో పే-సెక్షన్లో పనిచేసిన ఒక పోలీసు ఉద్యోగి మరణించిన ముగ్గురు కానిస్టేబుళ్ల ఎంప్లాయీ ఐడీలను ఉపయోగించి, IFMIS పోర్టల్లో ఇతరుల పేర్లను చేర్చారు. నిందితుడు ప్రైవేట్ బ్యాంకుల్లో నకిలీ ఖాతాలు తెరిచి తన వ్యక్తిగత మొబైల్ నంబర్లను అనుసంధానించడం ద్వారా 2022 నుండి 2026 వరకు ప్రభుత్వ జీతాల సొమ్మును అక్రమంగా పొందారు.
నిధుల మళ్లింపు
అక్రమంగా వచ్చిన సొమ్ముతో పర్సనల్ లోన్లు పొందడమే కాకుండా నగదును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కరీంనగర్ (Karimnagar) పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (Goush alam) ఆదేశాల మేరకు బాధ్యుడైన పోలీసుఉద్యోగిపై కరీంనగర్ I-టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాంచందర్ రావు తెలిపారు. ఇంకా ఎవరెవరికి ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయని అంతర్గత విచారణ జరుపుతున్నామని చెప్పారు. పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

