epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అల్లు అర్జున్​ను కాంగ్రెస్​ అరెస్ట్ చేయలేదా?.. రాహుల్​పై తమిళిసై ఫైర్​

కలం, వెబ్​డెస్క్​: తమిళనాట రాజకీయం సినిమాల చుట్టూ నడుస్తోంది. ఇప్పటికే టీవీకే అధినేత, నటుడు విజయ్ నటించిన ‘జన నాయగన్​’ (Jana Nayagan) చుట్టూ వివాదాలు ముసురుకోగా, ఇప్పుడు లిస్ట్​లోకి ‘పరాశక్తి’ (Paraasakthi) సినిమా చేరింది. శివకార్తికేయన్​ నటించిన ఈ సినిమాను బ్యాన్​ చేయాలంటూ కాంగ్రెస్​ డిమాండ్ చేసింది. మరోవైపు ఆ పార్టీ నాయకుడు, లోక్​సభలో ప్రతి పక్ష నేత రాహుల్​ గాంధీ.. ‘జన నాయగన్​’కు సెన్సార్​ బోర్డ్​ సర్టిఫికెట్ ​నిరాకరించడంపై మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ప్రధాని మోదీని విమర్శించారు. ఈ క్రమంలో రాహుల్​ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్​ నేత, తెలంగాణ మాజీ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai)​ ఘాటుగా స్పందించారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఎన్నో సినిమాలను అడ్డుకుందని, ఇప్పుడేమో రాహుల్​ నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటనలో కాంగ్రెస్​, రాహుల్​ తీరును ఎండగట్టారు.

‘ జన నాయగన్​ గురించి మాట్లాడే అర్హత రాహుల్​కు (Rahul Gandhi) లేదు. అతని పార్టీ ఎమర్జెన్సీ మొదలుకొని ఎన్నో సార్లు భావ ప్రకటన స్వేచ్ఛను కూనీ చేసింది. ఎన్నో సినిమాలను అడ్డుకుంది. కుట్టచరిత్రం అనే తమిళ సినిమాను ఏకంగా ఏడాది పాటు బ్యాన్​ చేసింది. ఇప్పుడేమే రాహుల్.. జన నాయగన్​ను అడ్డుకోవడం తమిళ సంస్కృతిపై దాడి అని అంటున్నారు. హిందీ వ్యతిరేక ఉద్యమం సమయంలో తమిళుల గొంతు నొక్కింది, వందలాది స్టూడెంట్లను కాల్చి చంపింది కాంగ్రెస్​ కాదా? శ్రీలంకలో వేలాది తమిళులను ఊచకోత కోస్తున్నా నోరెత్తకుండా ఉన్నది కాంగ్రెస్​–డీఎంకే గవర్నమెంట్​ కాదా? అంతెందుకు తెలంగాణలో పుష్ప–2 సినిమా రిలీజ్​ టైంలో థియేటటర్​ వద్ద అభిమానుల కారణంగా జరిగిన సంఘటనకు సినీ నటుడు అల్లు అర్జున్ ​(Allu Arjun) ను అరెస్ట్​ చేసింది కాంగ్రెస్​ గవర్నమెంట్​ కాదా?’ అని తమిళిసై (Tamilisai)​ ప్రశ్నించారు. తమిళుల సంస్కృతి, సంప్రదాయాల గురించి రాహుల్​ మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆమె ధ్వజమెత్తారు.

పరాశక్తిపై వివాదం ఏంటి?

తమిళ నటుడు శివకార్తికేయన్​ హీరోగా వచ్చిన సినిమా పరాశక్తి. ఇది 1960 వ దశాబ్దంలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో ఇందిరా గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్​ నేతలను తప్పుగా చిత్రీకరించారంటూ, ఈ మూవీని బ్యాన్ చేయాలని తమిళనాడు యూత్​ కాంగ్రెస్​ డిమాండ్​ చేస్తోంది. కాగా, ఈ సినిమాకు సెన్సార్​ బోర్డ్​ 23 కట్స్​ చెప్పి, యూ/ఏ సర్టిఫికెట్​ ఇచ్చింది. ఈ సినిమాకు తెలుగు మహిళ సుధ కొంగర దర్శకత్వం వహించారు.

Read Also: భారత్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలతో రెచ్చిపోయిన పాకిస్తాన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>