కలం వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal)లో రెండో విడత ఎన్నికలకు ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈ తరుణంలో టీఎంసీ (TMC) ప్రచార సభలో ఓ ప్రభుత్వ అధికారి దర్శనమివ్వడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి (Suvendu Adhikari) ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. టీఎంసీ అధినేత్రి మమతా తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్లో ఇలా ప్రభుత్వ అధికారులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుందని నిలదీశారు. భవవానీపూర్లో జరిగిన టీఎంసీ ఎన్నికల ప్రచార సభలో పబ్లిక్ సర్వీస్ కమిసన్ సభ్యుడు దిగంత బాగ్చీ పాల్గొన్న వీడియోను, ఆయన అధికార హోదాను ఎక్స్ వేదికగా సువేందు షేర్ చేశారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, ఇలా అధికార పార్టీ కేడర్లా వ్యవహరించడం సిగ్గుచేటని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే అధికారులను ఎంపిక చేసే అత్యున్నత సంస్థలో ఉన్న వ్యక్తులే ఇలా రాజకీయాల్లో తలదూర్చితే, రాష్ట్ర యువతకు నిష్పక్షపాతంగా న్యాయం జరుగుతుందని ఎలా ఆశిస్తామని సువేందు ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా రాజకీయమయమైందని విమర్శిస్తూ.. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే స్పందించి, దిగంత బాగ్చీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

