పాట్నా: బీహార్(Bihar)లోని సమ్రాట్ చౌదరి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తన తొలి భారీ కేబినెట్ విస్తరణను గురువారం ఘనంగా నిర్వహించింది. పాట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన ఈ బహిరంగ కార్యక్రమంలో మొత్తం 31 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ కొత్త మంత్రులచే పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సహా పలువురు జాతీయ నాయకులు హాజరై మంత్రులను అభినందించారు.
సామాజిక అంశం పరిగణనలోకి..
మాజీ సీఎం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ తొలిసారిగా మంత్రివర్గంలో చేరారు. నిషాంత్ కుమార్తో పాటు బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సిన్హా, రామ్ కృపాల్ యాదవ్, నితీష్ మిశ్రా వంటి సీనియర్లు కూడా మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ కూర్పులో సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తోంది. మొత్తం 32 మంది మంత్రులలో బీజేపీ కోటా నుంచి 15 మంది, జేడీయూ నుంచి 13 మంది, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నుంచి ఇద్దరు, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎం నుంచి ఒక్కొక్కరు చొప్పున బాధ్యతలు చేపట్టారు. బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని రాజ్యసభకు వెళ్లిన తర్వాత, సామ్రాట్ చౌదరి నేతృత్వంలో ఏర్పడిన తొలి బీజేపీ ప్రభుత్వానికి ఈ విస్తరణ ఒక కీలక ముందడుగు అని నేతలు చెప్తున్నారు. ఈ విస్తరణలో అందరి దృష్టి నితీష్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ పైనే ఉంది. రాజకీయాలకు దూరంగా ఉంటారని భావించిన నిషాంత్, అనూహ్యంగా నేరుగా మంత్రిగా బాధ్యతలు చేపట్టడం బీహార్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

