కలం, వెబ్ డెస్క్ : అస్సాంలోని జోర్హాట్ సమీపంలో భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానం (Sukhoi) ప్రమాదానికి గురైంది. శిక్షణలో భాగంగా గగనతలంలో ప్రయాణిస్తున్న ఈ విమానం జోర్హాట్కు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని కార్బీ ఆంగ్లోంగ్ జిల్లా పరిధిలో కుప్పకూలింది. జోర్హాట్ నుండి బయలుదేరిన ఈ యుద్ధ విమానం రాత్రి 7.42 గంటల సమయంలో చివరిసారిగా కంట్రోల్ రూమ్తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రాడార్ నుంచి దీని ఆచూకీ గల్లంతు కావడంతో వాయుసేన వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ప్రమాద సమాచారం అందిన వెంటనే భారత వైమానిక దళం రంగంలోకి దిగింది. గల్లంతైన విమానం, అందులోని వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు, రక్షణ చర్యలను ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో గాలింపు చర్యలకు కొంత ఆటంకం కలుగుతున్నప్పటికీ సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది.

