కలం, వెబ్ డెస్క్: తన నాలుగేళ్ల మనో వేదన వేంకటేశ్వర స్వామి దయతో తీరిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. గురువారం సాయంత్రం కాలినడకన కొండ పైకి వెళ్లిన కవిత శుక్రవారం తెల్లవారుజామున తన భర్త అనిల్తో కలిసి తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సత్యం, న్యాయం, ధర్మం దేవుడు తన వైపు ఉన్నారని కవిత వ్యాఖ్యానించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కోర్టులో క్లీన్ చిట్ రావడంతో కాలినడకన కొండకు వచ్చి మొక్కు తీర్చుకున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దానికి కూడా స్వామి వారి ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. తాను ఎప్పుడు తిరుమలకు వచ్చినా తెలంగాణ ప్రజలు, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటానని చెప్పారు. అలాగే ఆంధ్ర రాష్ట్రం, ప్రజలు బాగుండాలని, రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కవిత చివరలో జై తెలంగాణతో పాటు జై ఆంధ్ర అనడం ఆసక్తికరంగా మారింది.

