కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో శనివారం సాయంత్రం పలు చోట్ల పిడుగులు పడ్డాయి. మధ్యాహ్నం వరకూ విపరీతంగా ఎండ కొట్టి, సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి, ఉరుములతో కూడిన వర్షం పడింది. ఈ నేపథ్యంలోనే చంద్రుగొండ మండలం గానుగపాడులో పిడుగుపాటుకు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో పొలం పనులకు వెళ్లిన ఓ రైతు పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరవెండి గ్రామానికి చెందిన సోడే గోపయ్య పొలం పనులు కోసం వెళ్లగా, అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమై, పిడుగు పడడంతో, గోపయ్య అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.

