కలం, జోగులాంబ గద్వాల: గద్వాల్ జిల్లా నూతన పూర్తి స్థాయి జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు స్వీకరించిన విజయలక్ష్మిని (Gadwal DEO Vijayalakshmi) విద్యార్థి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా USFI రాష్ట్ర సహాయ కార్యదర్శి వామన్పల్లి రంగస్వామి మాట్లాడుతూ.. చాలా కాలం పాటు గద్వాల్ జిల్లాలో ఇన్చార్జ్ అధికారుల ఆధ్వర్యంలో విద్యాశాఖ పరిపాలన కొనసాగిందని అన్నారు. ప్రస్తుతం పూర్తి స్థాయి డీఈఓ నియామకం జరగడం జిల్లా విద్యారంగానికి ఎంతో శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, జిల్లాలో విద్యా వ్యవస్థ సమగ్ర అభివృద్ధికి ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని వారు డీఈఓను కోరారు.
గద్వాల్ జిల్లా విద్యారంగం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచేలా సమర్థవంతమైన పరిపాలన అందించాలని ఆకాంక్షిస్తూ, జిల్లాలో విద్యాభివృద్ధికి మరియు సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంఘాలు ఎల్లప్పుడూ తమ వంతు నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తాయని నాయకులు స్పష్టం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో USFI రాష్ట్ర సహాయ కార్యదర్శి వామన్పల్లి రంగస్వామితో పాటు గ్రాడ్యుయేషన్ అసోసియేషన్ సెక్రెటరీ భారత్, పాలమూరు యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ (SFI) ప్రెసిడెంట్ బత్తిని రాము, ఎండీ ఘఫూర్, కిరణ్, యువరాజు, సాంబ, ఇతర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

