కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad)లో పదో తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని మానిక్ భవన్ పాఠశాలతో పాటు నలంద హైస్కూల్ ఎగ్జామ్ సెంటర్లను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? అని ఆరా తీశారు. తప్పనిసరిగా సీసీ కెమెరా రికార్డింగ్ నడుమ ప్రశ్న పత్రాల బండిల్ సీల్ తెరవాలని సూచించారు. ఈ మేరకు నిబంధనలు పాటించారా? లేదా? అని సీసీ ఫుటేజీల పరిశీలన ద్వారా నిర్ధారణ చేసుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ఆరోగ్య కార్యకర్త అందుబాటులో ఉన్నారా? లేదా? అని గమనించారు. ఎగ్జామ్ హాల్లోకి సిబ్బంది ఎవరైనా సెల్ ఫోన్లతో వచ్చారా అని ప్రశ్నించి, పలు సూచనలు చేశారు.
ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని సిబ్బందికి సూచించారు. ఎక్కడా కాపీయింగ్ కు ఆస్కారం ఉండకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, కాపీయింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షలు ముగిసేంత వరకు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా పోలీసు బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా పూర్తి పారదర్శకంగా, పక్కాగా పరీక్షలు జరిపించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు జె.శంకర్, టి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

