కలం, వరంగల్ బ్యూరో: మామునూరు ఎయిర్పోర్టుపై కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలను బీఆర్ఎస్ (Warangal BRS) మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, నన్నపనేని నరేందర్ ఖండించారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎయిర్పోర్టు అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వమే పునాది వేసిందని పేర్కొన్నారు.
మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, మాజీ మంత్రి కేటీఆర్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), జీఎంఆర్ సంస్థతో చర్చలు జరిపారని తెలిపారు. 1.8 కిలోమీటర్ల రన్వేను 3.8 కిలోమీటర్లకు విస్తరించేందుకు రైతులను ఒప్పించి భూసేకరణ చేపట్టామని చెప్పారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలను ఖండిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వల్ల రాష్ట్రానికి పెద్దగా ప్రయోజనం లేదని విమర్శించారు.
ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలోనే మామునూరు ఎయిర్పోర్టు కోసం 253 ఎకరాల భూసేకరణకు కేబినెట్ ఆమోదం లభించిందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ కోసం రూ.500 కోట్లతో భూసేకరణ చేశామని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ ఇన్నేళ్లు అధికారంలో ఉండి కూడా మామునూరును ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ.. భూసేకరణకు అనుమతి ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మామునూరు ఎయిర్పోర్టును ముందుకు తీసుకువచ్చింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

