కలం, వెబ్డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై డీఎంకే అధినేత ఎంకె స్టాలిన్ (Stalin) వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మెరుపు వేగంతో రాజకీయ కొనుగోళ్లకు తెరలేపిందని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ లేని పరిస్థితుల్లో ఇతరుల మద్దతు కూడగట్టడం, విశ్వాస పరీక్షలో నెగ్గేందుకు వీలుగా అన్నాడీఎంకేలోని ఒక వర్గంతో పాటు మరికొంత మంది సభ్యులను కొనుగోలు చేసేందుకు రేటు మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
తమను తాము గొప్ప రాజకీయ శక్తిగా చెప్పుకుంటూ డబ్బా కొట్టుకునే వారు, నేడు ప్రజల దృష్టిలో బాధాకరమైన శక్తిగా అపకీర్తి మూటగట్టుకున్నారని స్టాలిన్ ఎద్దేవా చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో బలవంతంగా పదవులకు రాజీనామా చేయించి, సచివాలయంలోనే వారిని తమ పార్టీలో చేర్చుకుంటున్న ఇటువంటి దారుణమైన దృశ్యాలను చూడటానికే ప్రజలు మీకు ఓటు వేశారా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఏ మద్దతు కోరకూడదనే షరతుతో మద్దతు లేఖ ఇచ్చి.. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలను మంత్రివర్గంలో కూర్చుని ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నకిలీ బీజేపీ వ్యతిరేకత కూడా ఇక్కడ స్పష్టంగా బయటపడిందని స్టాలిన్ విమర్శించారు.

