కలం, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యే తీరు తీవ్ర కలకలం రేపుతోంది. శ్రీశైలం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే (Srisailam MLA) బుడ్డా రాజశేఖరరెడ్డి బుధవారం ఓ టోల్ప్లాజా ఉద్యోగిని కిడ్నాప్ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. నేషనల్ హైవే 340సీ పై పాములపాడు మండలం రుద్రవరం వద్ద ఉన్న టోల్గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
రుద్రవరం గ్రామానికి చెందిన మహేష్ అనే యువకుడు అక్కడ టోల్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అయితే, బుధవారం జరిగిన వివాదంలో ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి మహేష్ను దౌర్జన్యంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విషయం తెలుసుకున్న మహేష్ తల్లిదండ్రులు, తోటి ఉద్యోగులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే వద్దకు వెళ్లి నిలదీయడంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని భావించి చివరకు అతడిని విడిచిపెట్టారు. పట్టపగలే బహిరంగంగా ఒక ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగిని ఎమ్మెల్యే కిడ్నాప్ చేయడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

