కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలులో ఆలస్యం, తేమ శాతం (మాయిశ్చర్) పేరుతో రైతులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. తరుగు క్రింద ధాన్యాన్ని ఎక్కువమొత్తంలో తీస్తున్నారని అన్నారు. వరి ధాన్యం అమ్మిన తర్వాత చెల్లింపులు సమయానికి జరగడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు.
తద్వారా రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా వెంటనే కొనుగోలు కేంద్రాలను పెంచి, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. తమ పంటను కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడిచినా తీసుకోవడం లేదని, వర్షాలు పడితే ధాన్యం తడిసి ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. రైతులకు న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆయన (Srinivas Goud) విజ్ఞప్తి చేశారు.
Read Also: జ్యోతిష శాస్త్రంలో సరికొత్త విప్లవం.. ఈ యాప్తో దోష నివారణకు చెక్
Follow Us On : WhatsApp

