కలం, మహబూబ్నగర్ బ్యూరో: ప్రజా సమస్యలపై సమిష్టిగా పోరాడి ప్రజల ఆదరణ, పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ (BRS) కార్యాలయంలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులనుద్దేశించి మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రతిఒక్కరు సన్నద్ధం కావాలని పేర్కొన్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిలబడేవారికే సభ్యత్వ నమోదులో ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
ప్రస్తుతం ఎన్నికల సంఘం ‘ఓటర్ల జాబితా సవరణ’ ప్రక్రియను డిజిటల్ విధానంలోనే జరిపిస్తుందని, అలాగే పార్టీ సభ్యత్వాన్ని డిజిటలైజేషన్ పద్ధతిలోనే చేస్తున్నట్లు పేర్కొన్నారు. సర్ (SIR) విషయంలో నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. త్వరలోనే ఎస్ఐఆర్ సర్వేపై బూత్ స్థాయి ఏజెంట్స్కి అవగాహన కల్పిస్తామని ఆయన తెలిపారు. స్థానికంగా ఉండే ఓటర్లను తొలగించకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, హన్వాడ మాజీ ఎంపీపీ బాలరాజ్ పాల్గొన్నారు.

