కలం, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి (Amaravati)లో జరుగుతున్న వరుస అగ్ని ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఈ ఘటనలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) నియమించింది. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ ఈ బృందానికి నేతృత్వం వహించనున్నారు. ఈ సిట్ బృందంలో మొత్తం పది మంది సభ్యులు ఉన్నారు. అడిషనల్ ఎస్పీ రవికుమార్, తుళ్లూరు డీఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు దర్యాప్తులో భాగం కానున్నారు. ఈ వరుస ప్రమాదాల వెనక ఏదైనా కుట్రకోణం ఉందా అనే దిశగా సిట్ దర్యాప్తు చేయనుంది. అగ్ని ప్రమాదాలపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులను అప్రమత్తం చేశారు. త్వరలో ఈ ప్రమాదాలపై నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. హోం మంత్రి అనిత సైతం ఈ ప్రమాదాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు దర్యాప్తులో ఏం తేలుస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

