కలం, వెబ్ డెస్క్: ఏపీలోని అనంతపురం (Anantapur) జిల్లాలో గురువారం దారుణం జరిగింది. యాడికి మండలం కోనుప్పలపాడులో అత్తమామలపై కోపం పెంచుకొని.. తన బావమరిదిని బావ హత్య చేశాడు. ఈ మేరకు వివరాలను స్థానిక పోలీసులు వెల్లడించారు. వేమ్చంద్ర అనే బాలుడు (7) మంగళవారం స్కూల్ అయిపోయాక తిరిగివస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి మాయమాటలు చెప్పి బావ బోయ సర్వేశ్ దూరంగా తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లి అతడిని హత్య చేసి మృతదేహాన్ని కుందనకోటకొండలో పడేశాడు. బాలుడు ఇంటికి రాకపోవడంతో బయాందోళనకు గురైన తల్లిదండ్రులు.. తమ కుమారుడు కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో బాలుడిని తన బావ హత్య చేసినట్లు స్పష్టం చేశారు.
చిన్నారి వేమ్ చంద్ర అక్కను బోయ సర్వేశ్ పెళ్లిచేసుకున్నాడు. ఉగాది పండుగకు భార్యతో కలిసి సర్వేశ్ అత్తారింటికి వచ్చాడు. అత్తరింట్లో తనకు గౌరవం ఇవ్వడంలేదని అత్త, మామలపై కోపంతో ఊగిపోయిన సర్వేశ్.. ఎలాగైనా కక్ష తేర్చుకోవాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే ప్లాన్ వేసి.. పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా తినుబండారాలు ఇప్పిస్తానని వేమ్చంద్రను తీసుకెళ్లి సర్వేశ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. సర్వేశ్ దుర్మార్గపు ఘాతుకంతో గ్రామంలో విషాదంతో పాటు భయాందోళన మొదలైంది.

