కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీల పేరుతో నిలువుదోపిడీకి పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రోహిత్ రాజ్ (SP Rohith Raj) హెచ్చరించారు. అక్రమ వడ్డీ వ్యాపారులు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను ముంచేస్తున్న మోసగాళ్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు.
ప్రైవేట్ వ్యక్తుల వద్ద రుణాలు తీసుకునేటప్పుడు ప్రజలు పూర్తి అవగాహనతో, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు. ముందే వడ్డీ రేట్లు, తిరిగి చెల్లించే నిబంధనలను తెలుసుకోవాలని తెలిపారు. చెల్లింపుల్లో అలసత్వం సాకుగా చూపి బాధితులను వేధింపులకు గురిచేసే ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఉంచిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని కోరారు.
ఉద్యోగాలిస్తామంటే నమ్మొద్దు..
ఉద్యోగం పేరుతో ముందస్తుగా డబ్బులు డిమాండ్ చేసే ఎవరికీ నగదు చెల్లించవద్దని ఎస్పీ రోహిత్ రాజ్ కోరారు. ఉద్యోగ ప్రకటనలకు సంబంధించిన వివరాలను కేవలం ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ల ద్వారానే ధ్రువీకరించుకోవాలని హితవు పలికారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద ప్రకటనలు, అపరిచిత ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అక్రమ వడ్డీ వేధింపులు, ఉద్యోగ మోసాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు. ఇలా సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు.

