కలం, నిర్మల్ : బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు ప్రతి బుధవారం గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) తెలిపారు. బుధవారం నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భైంసా సబ్డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన 11 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వయంగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గత గ్రీవెన్స్ డేలో అందిన ఫిర్యాదుల పరిష్కార స్థితి, ఇంకా పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిపై అధికారులను ప్రశ్నించి, వాటిని వేగంగా పరిష్కరించాలని సూచించారు. కుటుంబ కలహాలకు సంబంధించిన ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, కుటుంబాలు తిరిగి కలిసేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సాయికిరణ్ పాల్గొన్నారు.

