కలం, స్పోర్ట్స్: లక్నోలో అఫ్ఘాన్ జట్టుకు టీమిండియా (India vs Afghanistan) చుక్కలు చూపించింది. బ్యాటింగ్లోనే కాకుండా బౌలింగ్లో కూడా అఫ్ఘాన్ ప్లేయర్ల చేత మూడు చెరువుల నీళ్లు తాగించారు భారత ప్లేయర్లు. బ్యాటింగ్లో శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ దూకుడుతో అఫ్ఘాన్ బౌలర్లు బెంబేలెత్తితే.. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్, గర్నూర్ బ్రార్ బంతులకు బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో అఫ్ఘాన్పై భారత్ 170పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆఖరి వరకు పరువు దక్కించుకునే పోరాటంలోనే అఫ్ఘాన్ బిజీ అయిపోయింది. 170కే 5 వికెట్లు పోవడంతో మ్యాచ్పై ఆశలు వదిలేసుకున్న అఫ్ఘాన్.. ఇక పరువు కాపాడుకోవడంపై ఫోకస్ పెట్టింది. అందుకే ఆ తర్వాత చాలా జాగ్రత్తగా ఆటను ముందుకు తీసుకెళ్లింది. దీంతో స్కోర్ బోర్డ్ నత్తనడకన ముందుకు కదిలింది. కానీ చివరకు 232 పరుగులకే అఫ్ఘాన్ను భారత్ (India vs Afghanistan) ఆలౌట్ చేసి తన సత్తా చాటుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులు చేసి మహ్మద్ సలీమ్ బౌలింగ్లో అవుటయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్మన్ గిల్, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అఫ్ఘాన్ బౌలర్లను చీల్చిచెండారు. గిల్ కేవలం 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్లతో 154 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ సైతం మెరుపు వేగంతో 79 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 125 పరుగులు రాబట్టాడు. వీరిద్దరినీ నంగేలియా ఖరోటే అవుట్ చేశాడు. శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 19 పరుగులు చేయగా, కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. గుర్నూర్ బ్రార్ 3 పరుగులు, అర్ష్దీప్ సింగ్ 3 పరుగులు, ప్రిన్స్ యాదవ్ 5 పరుగులు చేయగా, కుల్దీప్ యాదవ్ 3 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అఫ్ఘాన్ బౌలర్లలో నంగేలియా ఖరోటే 10 ఓవర్లలో 76 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 8 ఓవర్లలో 48 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, ఏఎమ్ గజన్ఫర్, మహ్మద్ సలీమ్ తలా ఒక వికెట్ సాధించారు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్ఘానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే కుప్పకూలింది. అఫ్ఘాన్ బ్యాటర్లలో రహ్మత్ షా 89 బంతుల్లో 8 ఫోర్లతో 79 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ 41 పరుగులు, ఇబ్రహీం జద్రాన్ 21 పరుగులు చేశారు. సెదికుల్లా అటల్ 42 పరుగులు చేయగా, దార్విష్ రసూలి 6 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. కెప్టెన్ హష్మతుల్లా షాహిది 4 పరుగులు, నంగేలియా ఖరోటే 6 పరుగులు, రషీద్ ఖాన్ 12 పరుగులు చేశారు. చివర్లో ఏఎమ్ గజన్ఫర్ 1 పరుగు, మహ్మద్ సలీమ్ 9 పరుగులు చేసి అవుటవగా, బిలాల్ సామి 2 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్ 10 ఓవర్లలో 60 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్ 9 ఓవర్లలో 45 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ సాధించారు.

