కలం, కరీంనగర్ బ్యూరో: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను భారత్ సురక్ష సమితి (Bharat Suraksha Samithi) రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు (ACS Raju) తీవ్రంగా ఖండించారు. జగిత్యాలలోని కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ “రాయ్ బరేలిలో రాహుల్ గాంధీ మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్లను ద్రోహులు అనడం తెలివి తక్కువతనమని విమర్శించారు. అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్దని, గాంధీ కుటుంబంతో సంబంధం లేకున్నా ఆ పేరు చెప్పుకోకపోతే రాజకీయాల్లో రాణించలేని అసమర్థుడు రాహుల్ అని విమర్శించారు. అంతర్జాతీయ పరిణామాలను గుర్తించకుండా పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహార ఉత్పత్తుల ధరలు పెరుగుతాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు.
దేశమే తన కుటుంబంగా పని చేస్తున్న త్యాగశీలి మోదీకి ఇతరుల సొమ్ములు, ఆస్తులు అక్కర్లేదని చెబుతూ… ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను ఇనుమడింప చేస్తున్న ప్రధానిపై ఓటమి నిరాశతో నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటని రాజు పేర్కొన్నారు. యుఎన్ఓకు చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆహార భద్రత, సుస్థిర వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి మోదీ చేస్తున్న కృషిని గుర్తించి ‘అగ్రికోలా మెడల్’తో సత్కరించిందని, దేశంలో ప్రతిపక్ష నాయకులు దీన్ని గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల మున్సిపల్ 22వ వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, నాయకులు అక్కినపల్లి కాశీనాథం, సింగం గంగాధర్, చిట్ల గంగాధర్, వేముల పోచమల్లు, ఎడమల వెంకట్ రెడ్డి, గండ్ర ప్రవీణ్ రావు, బాశెట్టి దుబ్బరాజం, నరేందుల శ్రీనివాస్, కొత్తకొండ బాలన్న, ఆర్ఎస్ఎస్ వీరన్న, రాయికల్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

