కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్(Global Summit)ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతలను తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేత, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ(Sonia Gandhi) రావడం లేదని తెలుస్తోంది.
అనారోగ్యకారణాలతో ఆమె ఈ సమావేశానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. దీంతో ఆమె తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఓ సందేశం పంపించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే దిశలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక భూమిక పోషిస్తుందని సోనియా గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని కోరారు.
తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక, ప్రాముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కాదల్చిన వారికి ఈ సమ్మిట్ ఒక వేదికగా అందిస్తుందని తెలిపారు. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ, వ్యవసాయాభివృద్ధి ప్రాజెక్టులకు సమ ప్రాధాన్యం ఇస్తూ మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని సోనియా గాంధీ(Sonia Gandhi) ఈ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలోని మానవ వనరులు, సహజ వనరులు, ప్రజల వ్యాపార నైపుణ్యం, అంతర్జాతీయ ప్రతిభ, సాంకేతిక నైపుణ్యాల అభివృద్దికి సమ్మిట్ మరింత తోడ్పడుతుందని ఆమె తెలిపారు. సమ్మిట్లో పాల్గొనే వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
Read Also: ఇండిగో ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్..
Follow Us On: Facebook


