కలం, వెబ్ డెస్క్: ఉద్యమాల పురిటి గడ్డ వరంగల్ (Warangal) మరో ఖ్యాతిని తన ఖాతాలో వేసుకుంది. దేశం నుంచి మొదటిసారి ఓ మైక్రో ఆర్ట్ (Micro Art) అంతరిక్షంలోకి వెళ్లనుంది. వరంగల్ జిల్లాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ అజయ్ కుమార్ దీన్ని రూపొందించారు. అజయ్ సూది రంధ్రంలో పట్టే పరిమాణంలో భారతీయ శాస్త్రవేత్తల ప్రతిరూపాలను తయారు చేశారు. వీటిని స్కైరూట్ ఏరో స్పేస్ (Skyroot Aerospace) విక్రమ్-1 రాకెట్ ద్వారా స్పేస్లోకి పంపించనున్నారు.
ఈ రాకెట్ జూలై 12 నుంచి ఆగస్ట్ 4 వరకు అంతరిక్షానికి ప్రయాణిస్తుందని స్కైరూట్ ఏరో స్పేస్ సంస్థ ప్రకటించింది. అజయ్ రూపొందించిన కళా ఖండాల్లో దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇందులో సీవీ రామన్, విక్రమ్ సారాభాయ్, అబ్దుల్ కలాం చిత్రాలు ఉన్నాయి. వీటిని రూపొందించేందుకు అజయ్ సుమారు 40 గంటల పాటు శ్రమించినట్లు తెలిపారు. వీటి తయారీ కోసం స్టెయిన్ లెస్ స్టీల్, బంగారం, వెండి, సిరామిక్ పొడి, కార్బన్ ఫైబర్ పొడి వినియోగించారు.
గతంలో సైతం కొన్ని మైక్రో ఆర్ట్స్ అంతరిక్షంలోకి పంపించారు. ప్రసిద్ధ మూన్ మ్యూజియం, ఫాలెన్ ఆస్ట్రోనాట్ మైక్రో ఆర్ట్స్ నుంచి కొన్ని కళా ఖండాలను తీసుకెళ్లారు. కానీ, భారత్ నుంచి అంతరిక్షానికి మైక్రో ఆర్ట్స్ని తీసుకెళ్లడం ఇదే మొదటిసారి. అజయ్ 40 ఏళ్లుగా మైక్రో ఆర్ట్స్ చేస్తున్నాడు. ఇన్నేళ్ల కృషికి ఆయనకు గొప్ప ఫలితం దక్కిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అజయ్ టాలెంట్ని ప్రశంసిస్తున్నారు.

