కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా దుబ్బాక (Dubbaka) మండలం రాజక్కపేట గ్రామ శివారులో హత్యకు గురైన కాంగ్రెస్ నాయకుడు బాల్ రెడ్డి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. భూ తగదాలతో సొంత చెల్లెలు రేణుక ఈ హత్య చేసినట్టు ఒప్పుకుంది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. పోలీసుల వివరాల ప్రకారం.. కొన్నేళ్లుగా బాల్ రెడ్డి, రేణుక రెడ్డి కుటుంబాల మధ్య రాజక్కపేట గ్రామ శివారులోని 11 ఎకరాల భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ రోజు మాట్లాడుకుందామని రేణుక పిలవడంతో బాల్ రెడ్డి పొలం వద్దకు వెళ్లాడు. పొలం వద్ద రేణుకతో పాటు ,అమె కొడుకు సోను రెడ్డి కుడా ఉన్నాడు.
భూమి గురించి పొలం వద్ద మాట్లాడుతుండగా మాట మాట పెరగడంతో బాల్ రెడ్డిపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసారు చెల్లెలు రేణుక, అల్లుడు సోను రెడ్డి. బాల్ రెడ్డి గొంతు తెగడంతో అక్కడికక్కడే చనిపోయాడు. హత్య అనంతరం చెల్లెలు రేణుక దుబ్బాక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. కాగా బాల్ రెడ్డి హత్యకు సహకరించిన మేనల్లుడు సోనురెడ్డి పరారీలో ఉన్నాడు. ఘటనా స్థలాన్ని సిద్దిపేట ACP రవీందర్ రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


