కలం, బాసర: చేనేత మగ్గంపై తెలుగు అక్షరమాలను అద్భుతంగా నేసిన పట్టుచీర (Telugu Letters Silk Saree) ను బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి (Sri Gnana Saraswati) అమ్మవారికి శుక్రవారం సమర్పించారు. సిరిసిల్ల వాస్తవ్యులు నల్ల పరంధాములు కుమారుడు, చేనేత కళాకారుడు నల్ల జగదీష్ ఈ ప్రత్యేక పట్టుచీరను రూపొందించారు. ఆరు మీటర్ల 30 సెంటీమీటర్ల పొడవు, సుమారు 650 గ్రాముల బరువున్న ఈ పట్టుచీరను చేనేత మగ్గంపై 15 రోజుల పాటు శ్రమించి రూపొందించారు.
ఈ ప్రత్యేక చీరను మేళతాళాల మధ్య బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి ఆలయ ఈఓ అంజనాదేవి, వేద పండితుల సమక్షంలో సమర్పించారు. తెలుగు అక్షరమాలతో నేసిన పట్టుచీరను అమ్మవారికి సమర్పించడం పద్మశాలి సమాజానికి గర్వకారణమని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో సత్ర అధ్యక్షులు రాపోలు సుధాకర్, కార్యనిర్వహక అధ్యక్షులు గుజ్జ రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శులు రమణ విశ్వం, జెంటిల్ శ్యామ్, స్థానిక సర్పంచ్ తీగల వెంకటేష్ గౌడ్, కొక్కుల గంగాధర్, మోరే సాయిలు, ఎలగందుల శ్రీనివాస్, ఓని స్వామి, రువ్విపోశెట్టి, మేకల అశోక్, అంకం రమేష్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు.

