కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తెలంగాణలో (Telangana) త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి కాగా, ఇప్పుడిది మూడోది. తెలంగాణతో సహా 16 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో దశలవారీగా ‘సర్’ కార్యక్రమం జరగబోతుంది. అయిదు లక్ష్యాలతో ఈ ప్రక్రియ జరగనుంది. కొత్త ఓటర్ల నమోదు, చనిపోయిన వారి పేర్లు తొలగింపు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారిన వారి వివరాల సేకరణ–అందుకు తగ్గట్లుగా సవరణ, నకిలీ ఓట్ల తగ్గింపు చేపడుతారు. ఒక్కో ఇంటికి కనీసం మూడు సార్లు అధికారులు వచ్చి వివరాలు వెరిఫై చేస్తారు.
జూన్ 15వ తేదీతో ‘సర్’ ప్రక్రియ మొదలు..
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమానికి సంబంధించిన కీలక తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
* జూన్ 15 నుంచి 24వ తేదీ వరకు సన్నాహాలు, శిక్షణ, ప్రింటింగ్ ప్రక్రియ.
* జూన్ 25 నుంచి జులై 24వ తేదీ వరకు ఇంటింటికి బూత్ లెవల్ అధికారుల పర్యటన.
* జులై 24వ తేదీలోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి.
* జులై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల.
* జులై 31 నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ.
* సెప్టెంబర్ 28వ తేదీలోపు అభ్యంతరాల పరిష్కారం.
* అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ, సర్ ప్రక్రియ పూర్తి.

