కలం, మెదక్ బ్యూరో: పంజాబ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో SIR పేరుతో బీజేపీ సరికొత్త కుట్రలకు తెరలేపుతోందని , SIR ప్రక్రియ ద్వారా కాంగ్రెస్ అనుకూల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని, అందుకే బూత్ లెవల్ ఏజెంట్లు అత్యంత పకడ్బందీగా, అప్రమత్తంగా వ్యవహరించాలని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) పిలుపునిచ్చారు.
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అందోల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల ముఖ్య సమావేశం జరిగింది. SIR సమగ్ర ఇంటింటి సర్వే / ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ పై అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. దేశంలోనే పుట్టి పెరిగిన స్థానిక పౌరులకు కూడా ఓటు హక్కు లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందని, SIR నెపంతో దేశవ్యాప్తంగా ఓట్ల సంఖ్యను సగానికి తగ్గించే పెద్ద కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం మరో పశ్చిమ బెంగాల్లా మారకుండా ఉండాలంటే SIR ప్రక్రియపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. బెంగాల్లో SIR అడ్డంపెట్టుకొని లక్షల ఓట్లు తొలగించి బీజేపీ గెలిచిందన్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మధ్యప్రదేశ్లో బీజేపీ తన రాజ్యసభ సీటును అక్రమంగా చోరీ చేసిందని మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు గట్టిగా పనిచేయాలని కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా క్యాడర్కు దిశానిర్దేశం చేశారు.

