కలం, మహబూబ్నగర్ బ్యూరో: ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది ప్రభుత్వ చేతగానితనం, నిర్లక్ష్యానికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం వనపర్తి (Wanaparthy) జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులకు సకాలంలో యూరియా అందకపోవడం, విద్యుత్ సరఫరాలో లోపాలు, అలాగే ధాన్యం కొనుగోలులో జాప్యం వల్ల రైతులు తమ పంటలను దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులు దళారులకు అమ్ముకోవడం ద్వారా ప్రభుత్వంపై భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే రేవంత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, రవాణా ఏజెన్సీల వైఫల్యం కారణంగా రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు అకాల వర్షాల కారణంగా నీటిపాలవుతున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో ధాన్యం వెంటనే కొనుగోలు చేసి వారంలోపే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు రేవంత్ పాలనలో రైతులు నెలల తరబడి ధాన్యం అమ్మకానికి వేచి చూడాల్సి వస్తోందని విమర్శించారు.
“రైతుల ఉసురు తాకి ప్రభుత్వం ఆగమాగం కాక తప్పదు” అంటూ ఆయన (Niranjan Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, రైతు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వేణు యాదవ్, కుమార్ యాదవ్ తదితరులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: అక్రమంగా బయోమెడికల్ వ్యర్థాల డంపింగ్.. రూ.40 వేల జరిమానా
Follow Us On: Instagram

