కలం, మెదక్ బ్యూరో : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలోని అత్యాధునిక పామాయిల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Ministers Tummala Nageswara Rao), బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎంకు రాసిన బహిరంగ లేఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా స్పందించారు. “ఈ పామాయిల్ ఫ్యాక్టరీ నాదో నీదో కాదు, ఇది ప్రజలది, రైతులది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ముఖ్యం. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ పూర్తి చేస్తే స్విచ్ వేసింది వేరేవాళ్లు. ఏ పథకమైనా పాలకుల ఖాతాలోకి పోతుంది, కానీ అదంతా ప్రజలదే” అని తుమ్మల (Ministers Tummala Nageswara Rao) వెల్లడించారు. తాను అయిదు ఫ్యాక్టరీల నిర్మాణానికి సంతకాలు చేసినప్పుడు మొదటి ప్రాధాన్యత సిద్దిపేట నర్మెట్టకు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు.
“కాళేశ్వరం ప్రాజెక్టుకు బాంబులు పెట్టారని అంటున్నవారికి బుద్ధి ఉండాలి. నేతలు తమ స్థాయిని తగ్గించుకుని చిల్లర మాటలు మాట్లాడవద్దు. అబద్ధాలు, అసత్యాలు కూడ పెట్టొద్దు పదవులు శాశ్వతం కావు, పదవులు పోయాయని చిల్లర మాటలు మాట్లాడి పరువు తీసుకోవద్దు” అని హరీశ్ రావును ఉద్దేశించి తుమ్మల విమర్శించారు. గత ప్రభుత్వం అరాచకాలు, అవినీతిని పెంచిందని, ప్రజలు దానికి బుద్ధి చెప్పారని తుమ్మల అన్నారు. “గత ప్రభుత్వం నాలుగు విడతలుగా రుణమాఫీ చేసింది. కానీ 25 లక్షల మంది రైతులకు ఒకే విడతలో రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిది. రైతుల్ని రెచ్చగొట్టడమే పనిగా అబద్ధాలు ఆడుతున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్న అప్పు గత ప్రభుత్వం చేసిన అప్పుల పాపాల వడ్డీకి సరిపోతుంది” అని ఆయన మండిపడ్డారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా రైతులకు స్థిర ఆదాయం కల్పించడమే లక్ష్యమని, ఆయిల్ పామ్ సాగును విస్తరించి తెలంగాణను ఆయిల్ పామ్ హబ్గా తీర్చిదిద్దాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

