కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకున్నది. ప్రధాని నరేంద్ర మోదీ (Modi).. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాల్సిన అవసరం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. కాగా గత ఎనిమిది రోజుల్లో ఈ ఇద్దరు నేతలు చర్చలు జరపడం ఇది రెండోసారి. పశ్చిమాసియాలో కీలక మౌలిక సదుపాయాలపై ఇరాక్ చేస్తున్న దాడులను మోడీ ఖండించారు. ఇవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ, ప్రపంచ సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. ఇరాన్ అధ్యక్షుడికి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.
నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండేలా చూడడం ఎంతో కీలకమని మోదీ స్పష్టం చేశారు. ఇరాన్లో ఉన్న భారతీయుల భద్రత కోసం ఇరాన్ అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. ఈ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి మోదీ అనేక దేశాధినేతలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నారు. ఇటీవల బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఖతార్ అమీరుడు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, జోర్డాన్ రాజు అబ్దుల్లా ద్వితీయుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రోన్లతో కూడా ఆయన చర్చలు జరిపారు. దౌత్య మార్గంలోనే చర్చలు జరగాల్సిన అవసరం ఉందని భారత్ పునరుద్ఘాటించింది. హోర్ముజ్ జలసంధి సురక్షితంగా, స్వేచ్ఛగా నౌకాయానానికి అందుబాటులో ఉండాలని తెలిపింది. ఇదిలా ఉండగా, అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులను మరింత పెంచే అవకాశముందని హెచ్చరించాయి. మరోవైపు, ఇరాన్ తన వైఖరిని కఠినంగా కొనసాగిస్తూ, శత్రువులకు లొంగబోమని స్పష్టం చేసింది.

