కలం, మెదక్ బ్యూరో : ధరణి పోర్టల్ అక్రమాలకు సంబంధించి సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి తహసీల్దార్ (Kuknurpalle MRO) సుజాతపై వేటు పడింది. ఆమెను విధుల నుంచి తాత్కాలికంగా తప్పిస్తూ జిల్లా కలెక్టర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. భూముల పోర్టల్తో సంబంధం లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా సుజాత సుమారు 56 ఫైళ్లను ఆమోదించి, యాజమాన్య హక్కుల మార్పిడికి పాల్పడినట్లు రెవెన్యూ వర్గాల ప్రాథమిక విచారణలో తేలింది.
ప్రభుత్వం పేదలకు కేటాయించిన అసైన్డ్ భూములకు సంబంధించి కూడా భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. వారసత్వ బదిలీ కింద నిబంధనలకు విరుద్ధంగా 10 దస్త్రాలను ఆమోదించి, ఆ భూములపై ఇతరులకు యాజమాన్య హక్కులు కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో మొత్తం 448 ఎకరాలకు సంబంధించిన భూ హక్కుల్లో భారీగా మార్పులు చేర్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ అక్రమాల్లో తహసీల్దార్ పాత్ర స్పష్టంగా వెలుగుచూడటంతో కలెక్టర్ ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.

