కలం, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు (Prabhakar Rao) సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు రెగ్యులర్ బెయిల్గా మార్చింది. ఈ మేరకు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. కొన్ని షరతులు కూడా విధించింది. అనుమతి తీసుకోకుండా విదేశీ పర్యటనలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఏ రూపంలోనూ సాక్షులను ప్రభావితం చేసేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. పోలీసులకు పూర్తిగా సహకరించాలని సూచించింది. అయితే ఈ కేసుకు సంబంధించి త్వరలోనే పూర్తిస్థాయి చార్జ్షీట్ వేస్తామని సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
అప్పట్లో తీవ్ర సంచలనం
బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్ వంటి ఎందరో ప్రముఖులు ఫోన్ ట్యాపింగ్ బాధితులు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అసలు సూత్రదారులు ఎవరో తేల్చేందుకు సిట్ వేసింది. దీంతో సిట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్న ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు సహా పలువురు అధికారులను అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించింది. ఇక ఈ కేసులో కీలక ముద్దాయిగా ఉన్న సీఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చాలా రోజులపాటు అమెరికాలో తలదాచుకున్నారు. చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన లొంగిపోక తప్పలేదు. ఆయనను సిట్ అధికారులు కస్టడీలో తీసుకొని విచారించారు. ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కూడా అధికారులు విచారించినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ప్రభాకర్ రావుకు ఈ కేసులో పూర్తిస్థాయి బెయిల్ దక్కింది. మరి ఈ కేసులో సిట్ తదుపరి చర్యలు ఏమిటి? గత ప్రభుత్వ పెద్దల పాత్రపై విచారణ కొనసాగుతుందా? లేదంటే ఈ కేసు ఇంతటితో ముగుస్తుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: వాణిజ్య గ్యాస్ సరఫరాపై నిఘా.. ముగ్గురు అధికారులతో కమిటీ
Follow Us On: Instagram

