కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల వల్ల ముడిచమురు దిగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఎల్పీజీ సరఫరాపై (LPG Supply) కీలక నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత లేకుండా చూడటమే ప్రథమ ప్రాధాన్యతగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాణిజ్య అవసరాల కోసం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర విభాగాలకు ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయాలని నిర్ణయించింది.
మిగిలిన వాణిజ్య రంగాలకు గ్యాస్ సరఫరాను (LPG Supply) పర్యవేక్షించేందుకు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలకు చెందిన ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు శైలేంద్ర, పాండియన్, ధ్రువ్ కపిల్లతో కూడిన ప్రత్యేక కమిటీని (Special Committee) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఏదైనా అత్యవసరమైతే ఈ కమిటీ ప్రతినిధులకు ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తులు పంపుకోవచ్చు. ముడిచమురు దిగుమతిపై ఆధారపడి వాణిజ్య సిలిండర్ల సరఫరా ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రాధాన్యత ప్రకారమే సరఫరా జరుగుతుందని, ఏవైనా ఫిర్యాదులు, రిక్వెస్టులు ఉంటే మెయిల్ చేయాలని సూచించింది. ప్రతీ మెయిల్కు సమాధానం ఇవ్వలేమని, అన్నింటినీ పరిగణనలోకి తీసుకోలేమని, అత్యవసర పరిస్థితికి అనుగుణంగా పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
Read Also: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు బిగ్ రిలీఫ్
Follow Us On: Facebook

