కలం, స్పోర్ట్స్ : ఐపీఎల్ 2026 సీజన్కు ముందే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన లక్ష్యాన్ని స్పష్టం చేశారు. గత ఏడాది రన్నరప్గా నిలిచిన తమ జట్టు, ఈసారి అడుగు ముందుకు వేసి ట్రోఫీని గెలవడమే తన ఏకైక గోల్ అని ప్రకటించారు. చండీగఢ్లో జరిగిన జట్టు జెర్సీ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన ఆరోగ్య సవాళ్లను కూడా పంచుకున్నారు. గత అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్కు స్ప్లీన్ దెబ్బతినడంతో ఆపరేషన్ జరిగింది.
ఆ సమయంలో తాను ఏడు కిలోల బరువు తగ్గానని, తిరిగి ఫిట్నెస్ సాధించడం చాలా సవాలుగా మారిందని ఆయన వివరించారు. ఆ కష్టకాలం నుంచి కోలుకుని, మళ్ళీ జట్టుకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని అయ్యర్ పేర్కొన్నారు. అంచనాలు ఎక్కువగా ఉండటం తనకు ఇష్టమని, ఈసారి మైదానంలోకి దిగిన ప్రతిసారి గెలవడమే తమ పని అని ఆయన స్పష్టం చేశారు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అద్భుత ప్రదర్శన చేసింది.
అయ్యర్ ఏకంగా 604 పరుగులతో రాణించి జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లారు. అయితే తుది పోరులో బెంగళూరు చేతిలో కేవలం ఆరు పరుగుల తేడాతో విజయం చేజారింది. ఆ వెలితిని ఈ ఏడాది పూడ్చుకోవాలని పంజాబ్ కింగ్స్ పట్టుదలతో ఉంది. జట్టు సభ్యుల మధ్య ఐక్యత పెంచేందుకు తాము హోటల్ గదిలో గేమ్స్ ఆడుతూ గడుపుతున్నామని, మైదానంలోకి వెళ్లే ముందే ఒక కుటుంబంలా మారుతున్నామని అయ్యర్ తెలిపారు.
జట్టు స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ కూడా తన కెప్టెన్ వ్యాఖ్యలను సమర్థించారు. ముల్లాన్పూర్లోని సొంత ప్రేక్షకుల మద్దతు తమకు పెద్ద బలమని, ఒత్తిడిని ఒక గౌరవంగా భావిస్తానని ఆయన చెప్పారు. కెరీర్ ఆరంభంలో తనను నమ్మిన ఈ ఫ్రాంచైజీకి ఎన్నో ట్రోఫీలు అందించాలని ఉందని అర్ష్దీప్ తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. మార్చి 31న గుజరాత్ టైటాన్స్తో జరిగే తొలి మ్యాచ్తో పంజాబ్ తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పట్టుదల, యువ బౌలర్ అర్ష్దీప్ జోష్ చూస్తుంటే ఈసారి పంజాబ్ కింగ్స్ టైటిల్ వేటలో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

