కలం, స్పోర్ట్స్ : శ్రేయాస్ అయ్యర్.. ఒకప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కున్నా.. ఈ ఏడాది ఐపీఎల్ 2026 సీజన్లో మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అదరగొడుతున్నాడు. ప్రస్తుతం శ్రేయాస్ (Shreyas Iyer) టాక్ ఆఫ్ ది నేషన్గా మారాడు. అతడిని వదులుకున్న ఫ్రాంచైజీలు ఇప్పుడు బాధ పడుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు సరికొత్త రికార్డులతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో ఆయన నిలకడ చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజా ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ను కెప్టెన్గా ముందుండి నడిపిస్తూ, అదిరిపోయే ఫినిషర్గా కూడా అయ్యర్ (Shreyas Iyer) అదరగొడుతున్నారు. పంజాబ్ జట్టును పాయింట్స్ టేబుల్లో టాప్ పొజిషన్లో పెట్టడమే కాకుండా, ఒక్కటంటే ఒక్క ఓటమి కూడా ఎరుగని జట్టుగా నిలబెట్టాడు. అయితే ఈ విజయాల వెనుక పెద్ద కథే ఉంది.
ఒకప్పుడు అయ్యర్కు ‘షార్ట్ బాల్’ ఆడటం రాదని చాలా మంది ఎగతాళి చేసేవారు. బౌన్సర్ వేస్తే చాలు అయ్యర్ అవుట్ అని విమర్శలు వచ్చేవి. దీనిపై అయ్యర్ తాజాగా స్పందించారు. తన వల్ల ఏ పని కాదని ఎవరైనా అంటే తనకు అస్సలు నచ్చదని ఆయన చెప్పారు. ఆ మాటలే తనను కసిగా కష్టపడేలా చేశాయని, తనను తక్కువ అంచనా వేసిన వారందరికీ తానేంటో నిరూపించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వెన్ను గాయం అయినప్పుడు కూడా తన కెరీర్ అయిపోయిందని కొందరు అన్నారని అయ్యర్ గుర్తు చేసుకున్నారు. కానీ తన మనసులో మాత్రం ‘నేనెందుకు తిరిగి రాకూడదు?’ అనే పట్టుదల ఉండేదన్నారు. ఇక షార్ట్ బాల్ సమస్య గురించి మాట్లాడుతూ.. గతంలో అలాంటి బంతులను కేవలం సింగిల్స్ తీయడానికో లేదా కిందకు ఆడటానికో ప్రయత్నించేవాడినని చెప్పారు. కానీ ఇప్పుడు తన జోన్లోకి షార్ట్ బాల్ వస్తే సిక్సర్ కొట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో కొట్టిన సిక్సరే దీనికి నిదర్శనం.
ఈ మార్పు కోసం అయ్యర్ (Shreyas Iyer) చాలా కష్టపడ్డారు. నెట్స్లో రోజుకు 300 బంతుల వరకు ఆడుతూ, దాదాపు 50 ఓవర్ల పాటు ప్రాక్టీస్ చేస్తున్నట్లు వివరించారు. కేవలం సైడ్ ఆర్మ్ త్రోలు కాకుండా, నిజమైన బౌలర్లను ఎదుర్కోవడం వల్లే తనలో ఈ స్పష్టత వచ్చిందని చెప్పారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లలాగే బౌలర్ బంతి వేయకముందే సరైన పొజిషన్లోకి వెళ్లడం అలవాటు చేసుకున్నానని అయ్యర్ పేర్కొన్నారు.
Read Also: వేసవిలో పెరుగు తింటే.. ఎన్నెన్నో లాభాలు!
Follow Us On: Sharechat

