కలం, వెబ్డెస్క్: తెలంగాణ మాజీ డీజీపీ శివధర్ రెడ్డి (Shivadhar Reddy) స్టేట్ సెక్యూరిటీ అడ్వయిజర్గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీగా పదవీ విరమణ చేసిన వెంటనే ఆయనను కీలక పోస్టులో నియమిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, నేర నియంత్రణ, డ్రగ్స్ కట్టడి, రోడ్డు భద్రత వంటి కీలక అంశాల్లో ప్రభుత్వానికి ఆయన సలహాలు, సూచనలు అందజేయనున్నారు.
ఈ నియామకంతో శివధర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి హోదాను కల్పించారు. ఆయనకు నెలకు రూ. 2.25 లక్షల గౌరవ వేతనంతో పాటు, రూ.50 వేల ఇంటి అద్దె భత్యం, ప్రభుత్వ వాహనం, వైద్య సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఆయన కార్యాలయ నిర్వహణ కోసం ఒక ఓఎస్డీ, ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్, నలుగురు ఆఫీస్ సబార్డినేట్లు సహా ఇతర సిబ్బందిని హోం శాఖ కేటాయించనుంది. శివధర్ రెడ్డి డీజీపీగా అందించిన సేవలు, ఆయన అనుభవం దృష్ట్యా రాష్ట్ర భద్రతా వ్యవహారాల్లో ఆయన సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

