కలం, దేవరకొండ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ దేవరకొండను ఆదర్శ పట్టణంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే (Devarakonda MLA) నేనావత్ బాలు నాయక్ (Nenavath Balu Naik) తెలిపారు. గురువారం పట్టణంలోని 1, 2, 3 వార్డులలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖిల్లా బజార్, బొడ్రాయి బజార్, పాత పోలీస్ స్టేషన్, మసీదు సెంటర్లలో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, ముత్యాలమ్మ బజార్లో చేపడుతున్న మురికి కాలువల నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే, పనులలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇప్పుడు ఆచరణలో చూపిస్తున్నామని అన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సురక్షిత తాగునీటి సదుపాయాలను కల్పిస్తూ పట్టణ రూపురేఖలను మార్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రజల అవసరాల ఆధారంగా అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యతతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతం, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని పేర్కొన్నారు.
ప్రజాధనంలోని ప్రతి రూపాయి సద్వినియోగం కావాలని, అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే బాలు నాయక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ-వెంకటేశ్వర్లు, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎం.ఏ. సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి హనుమంతు వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.

