కలం, వెబ్ డెస్క్ : కేరళలో షిగెల్లా వ్యాధి (Shigella infection) విజృంభిస్తోంది. రాష్ట్రం (kerala)లోని కోళికోడ్ జిల్లాలో ఈ ఇన్ఫెక్షన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో వ్యాధిగ్రస్తులకు సంబంధించిన బంధువులే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తాజా కేసులతో కలిపి ఆ ప్రాంతంలో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో షిగెల్లా వ్యాధితో నాలుగేళ్ల చిన్నారి మరణించడం.. మరో ఇద్దరికి ఇన్ఫేక్షన్ సోకడంతో భయాందోళనలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్ఫెక్షన్ కేసులు పెరగకుండా కార్యాచరణ రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టింది. వ్యాధి వ్యాప్తి ఉన్న ప్రాంతాలకు ప్రభుత్వం ఆరోగ్య బృందాలను పంపి వ్యాధిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది. విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి సహ ఇతర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరిన వారికి చికిత్స అందిస్తున్నారు.
కాగా, షిగెల్లా ఇన్ఫెక్షన్ కలుషిత నీరు, అపరిశుభ్రమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. జీర్ణకోశ సంబంధమైన ఇన్ఫెక్షన్ కారణంగా విరేచనాలు, కడుపు నొప్పి, వాంతులు, జ్వరం, నీరసం, తీవ్రమైన పరిస్థితుల్లో మలంలో రక్తం పడడం వంటివి షిగెల్లా వ్యాధి లక్షణాలు. వ్యాధి వ్యాప్తి తీవ్రం అవుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టి పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేసింది.

