కలం, వెబ్ డెస్క్: మహిళలకు చేయూత దిశగా మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలోరాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి సభ (Mahila Shakti Sabha) నిర్వహిస్తోంది. ఈ సభలో మహిళా స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ (CM Revanth) పంపిణీ చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో మహిళాశక్తి సభ జరుగనుంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం జెండా ఊపి ఆర్టీసీ బస్సులను ప్రారంభించనున్నారు. నేటి నుంచి మహిళల బస్సుల నిర్వహణ బాధ్యతను ఆర్టీసీకి అప్పగించనున్నారు. అటు మహిళా సంఘాలకు ఇచ్చే రుణాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించగా.. సీఎం రేవంత్ అధికారికంగా ప్రకటించనున్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద రూ.500 కోట్ల చెక్కులు పంపిణీతో పాటు మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ ఛార్జీల చెక్కులను సైతం పంపిణీ చేయనున్నారు.
నేడు నిర్వహించనున్న సికింద్రాబాద్ మహిళా సభను విజయవంతం చేయాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఇది మహిళా సంక్షేమ ప్రభుత్వమని.. మహిళా సంఘ సభ్యులను మహిళా సభకు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆడబిడ్డలంతా సభకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా సంఘాల వార్షిక రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతూ సీఎం నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలిపారు.

