కలం, వెబ్ డెస్క్ : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) సోషల్ మీడియా వేదికగా చేసిన పొరపాటు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారితీసింది. ఇరాన్కు విధించిన డెడ్లైన్ను పొడిగించాలంటూ ఆయన చేసిన ఒక ట్వీట్, ఆయనను నెటిజన్ల ముందు అడ్డంగా బుక్ చేసింది. అసలు విషయం ఏమిటంటే, షెహబాజ్ షరీఫ్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక సందేశాన్ని పోస్ట్ చేసే క్రమంలో, దాని పైన ఉన్న ‘Draft-Pakistan’s PM Message on X’ అనే శీర్షికను కూడా తొలగించకుండానే అలాగే పోస్ట్ చేశారు.
దీనిని గమనించిన నెటిజన్లు వెంటనే స్క్రీన్ షాట్లు తీసి వైరల్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ఆయన తన తప్పును సరిదిద్దుకుని పోస్ట్ను ఎడిట్ చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనతో షెహబాజ్ షరీఫ్ సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ను కేవలం కాపీ పేస్ట్ చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఆ సందేశం అమెరికా నుంచి వచ్చి ఉంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఒత్తిడి మేరకే పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకుందని, ఆ దేశం చేతిలో షెహబాజ్ (Shehbaz Sharif) ప్రభుత్వం ఒక కీలుబొమ్మలా మారిందని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఒక దేశ ప్రధాని స్థాయిలో ఉండి, కనీసం డ్రాఫ్ట్ మెసేజ్ను సరిచూసుకోకుండా పోస్ట్ చేయడం పాకిస్థాన్ ప్రతిష్టను దిగజార్చిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ ‘కాపీ-పేస్ట్’ వ్యవహారం పాక్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

