కలం వెబ్ డెస్క్: మరికొద్ది గంటల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న తరుణంలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలవడం ఖాయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే టీఎంసీకి గతంలో వచ్చినంత మెజారిటీ రాకపోవచ్చని చెప్పారు. ప్రజలతో మాట్లాడితే ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయో అర్థం అవుతుందన్నారు. ఎగ్జిట్ పోల్స్, జర్నలిస్టుల అనలటిక్స్ కంటే ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తున్నారన్నదే ప్రధానమన్నారు. ఇక కేరళలో UDF విజయం ఖాయమని శశిథరూర్ చెప్పారు. మిగతా చోట్ల ఫలితాలపై తనకు అవగాహన లేదన్నారు.
ఇక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై స్పందించిన శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ఎగ్జిట్ పోల్స్లో చాలా లోపాలు ఉంటాయి, తాను వాటిని నమ్మనని వ్యాఖ్యానించారు. అయితే కేరళలో అన్ని సంస్థలు యూడీఎఫ్ గెలుస్తుందని అంచనా వేయడం విశేషమని అభిప్రాయపడ్డారు. తాను కలిసిన నిపుణులు, జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, యూడీఎఫ్ విజయంపై ధీమాగా ఉన్నారన్నారు. ఒకవేళ ఫలితం మరోలా ఉంటే అది ఆశ్చర్యకరమైన విషయమే అవుతుందని వ్యాఖ్యానించారు. భారత్లో ఎగ్జిట్ పోల్స్కు విలువ లేదని శశి థరూర్ వ్యాఖ్యానించారు. దేశంలో ఓటు వేసిన ప్రజల్లో ఎక్కువ మంది తాము ఎవరికి ఓటు వేశారో చెప్పుకోవడానికి ఆసక్తి చూపించరని చెప్పారు. అలాంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

