కలం, డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో గంజాయి బ్యాచ్ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్డు మీద గొడవలు పడటం, చిన్నారులు, మహిళల మీద దాడులు చేస్తూ.. నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇప్పుడు శంషాబాద్ లోని ధర్మగిరి పరమశివుడి ఆలయంలో తప్పుడు పనిచేశారు ఓ ఇద్దరు యువకులు. ఏకంగా గంజాయిని శివుడికి ప్రసాదంగా (Ganja Prasadam) పెట్టి దాన్ని వీడియో తీసి ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. ఇది చూసిన నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీపీ సజ్జనార్ (CP Sajjanar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఎక్స్ వేదికగా ఆ వీడియోను పోస్టు చేస్తూ.. ‘దైవానికి మత్తు పదార్థాలను ప్రసాదంగా (Ganja Prasadam) పెట్టడం అత్యంత హేయమైన చర్య. ఇది ఉన్మాదంతో సమానం. సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం ఇలాంటి చెత్త పనులు చేయడం సరైంది కాదు. ఒక్కసారి ఎన్డీపీఎస్ చట్టాలను వినియోగిస్తే.. జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. సోషల్ మీడియాను మీలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఉపయోగించండి. అంతే గానీ.. ఇలా వికృత చేష్టల కోసం కాదు’ అంటూ సీరియస్ అయ్యారు సజ్జనార్. ప్రస్తుతం ఆ ఇద్దరు యువకుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అతి త్వరలోనే వారిద్దరినీ పట్టుకుంటామని చెబుతున్నారు.
Read Also: హల్దీరామ్ స్వీట్ హౌస్పై కేసు నమోదు
Follow Us On : WhatsApp


