కలం, వెబ్డెస్క్: భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మైదానంలో మళ్లీ హోరాహోరీ పోరును చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే అంటున్నారు బంగ్లా స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (Shakib Al Hasan). తాజాగా టెస్టు, టీ20 రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఆయన, ఇరు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు త్వరలోనే గాడిన పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కొంతకాలంగా రెండు దేశాల మధ్య క్రికెట్ విషయంలో కొంత గ్యాప్ వచ్చింది.
బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం రావడం శుభపరిణామమని షకీబ్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం క్రికెట్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన నమ్ముతున్నారు. అలాగే, త్వరలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఎన్నికలు జరుగుతాయని, ఆ తర్వాత బీసీసీఐతో సహా ఇతర బోర్డులతో చర్చలు ఫలవంతంగా సాగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, భారత బోర్డుతో సంబంధాల వల్ల కలిగే ప్రయోజనాలను గుర్తించిన బంగ్లాదేశ్ బోర్డు, ఇప్పటికే చర్చలు ప్రారంభించింది. బీసీసీఐకి తాము లేఖ రాశామని, ఇతర దేశాల బోర్డులతో కూడా టచ్లో ఉన్నామని బీసీసీ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ నజ్ముల్ అబిదిన్ ఫాహిమ్ వెల్లడించారు.
వచ్చే ఎన్నికలు, బోర్డుల మధ్య జరిగే చర్చల ఫలితంగా మైదానంలో భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మళ్ళీ సందడి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇది క్రీడాభిమానులకు మంచి వార్త అనే చెప్పాలి. ఏదేమైనా, ఇరు దేశాల క్రికెట్ భవిష్యత్తు ఇప్పుడు జరగబోయే చర్చల మీద ఆధారపడి ఉంది. 2026 ఐపీఎల్ సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుండి పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను బీసీసీఐ తప్పించడం ఇరు బోర్డుల మధ్య దూరాన్ని పెంచింది. దీనికి నిరసనగా ఇండియాలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ల నుండి బంగ్లాదేశ్ వైదొలిగింది. 2024 తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగలేదు. చివరగా 2025 ఆసియా కప్లో తలపడినప్పటికీ, ఆగస్టులో జరగాల్సిన సిరీస్ వాయిదా పడి అస్పష్టంగానే మిగిలిపోయింది.

