కలం, వెబ్డెస్క్: ఐపీఎల్ (IPL) 2026లో ముంబై ఇండియన్స్ ఎదుర్కొంటున్న వరుస పరాజయాలపై మాజీ స్పిన్నర్ మురళీ కార్తీక్ (Murali Kartik) ఘాటుగా స్పందించారు. బుధవారం సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓటమిని విశ్లేషిస్తూ, జట్టు వైఫల్యాలకు ఫీల్డింగ్ తప్పిదాలే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు. ‘‘వాంఖడే స్టేడియంలో 243 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ, ముంబై దానిని కాపాడుకోలేకపోయింది. ముఖ్యంగా సన్రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇచ్చిన సులభమైన క్యాచ్లను నమన్ ధీర్ (Naman Dhir) రెండుసార్లు చేజార్చారు. ఈ తప్పిదమే ముంబై కొంపముంచింది’’ అని కార్తీక్ అభిప్రాయపడ్డారు. హెడ్ కేవలం 30 బంతుల్లో 76 పరుగులు చేసి మ్యాచ్ను ముంబై చేతుల్లోంచి లాగేసుకున్నారని అన్నారు.
మైదానంలో క్యాచ్లు వదిలేస్తే దేవుడు కూడా కాపాడలేడని కార్తీక్ వ్యాఖ్యానించారు. బ్యాటర్లు మంచి బంతులను కూడా బాదుతున్నప్పుడు, కనీసం చేతికి వచ్చిన క్యాచ్లనైనా పట్టుకోవాలని, కానీ నమన్ ధీర్ చేసిన తప్పిదాలకు ఎలాంటి సాకులు లేవని ఆయన అన్నారు. పవర్ప్లేలో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాల్సింది పోయి, 10వ ఓవర్ వరకు వికెట్ తీయలేకపోవడం జట్టు వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మరోవైపు మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ముంబై బౌలింగ్ను విమర్శించారు. జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ, వ్యూహాలను అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్నారని, వికెట్లు తీయకపోతే పరుగులను నియంత్రించడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

