కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛమైన ఇంధన రంగానికి మరింత ఊతమిస్తూ రాయలసీమలో మరో భారీ పెట్టుబడి రానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సోషల్ మీడియా వేదికగా కీలక ప్రకటన చేశారు. రాయలసీమ అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే భారీ పెట్టుబడిని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. రూ.5,750 కోట్ల పెట్టుబడితో 800 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు పత్తికొండలో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధికి, ఉపాధి అవకాశాల పెరుగుదలకు, రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాల విస్తరణకు గణనీయమైన ఊతం లభించనుంది.
ఈ ప్రాజెక్టులో ప్రముఖ సంస్థలు Tata Power, Suzlon Energy భాగస్వాములుగా ఉండనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ #RayalaseemaRising, #ChooseSpeedChooseAP హ్యాష్ట్యాగ్లతో “రాయలసీమను మార్చే ఉమ్మడి విజన్తో రెండు దిగ్గజ సంస్థలు కలిసి ముందుకు వస్తున్నాయి. మరికొద్ది సేపట్లో పత్తికొండలో కలుద్దాం” అని పేర్కొన్నారు. ఈ భారీ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడి రాష్ట్రంలో పరిశ్రమలు, స్వచ్ఛ ఇంధన రంగాల అభివృద్ధికి మరో మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

