కలం, డెస్క్ : 2026-27 కేంద్ర బడ్జెట్ మీద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) స్పందించారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను (Nirmala Sitharaman) అనేక సార్లు కలిసి వినతిపత్రాలు ఇచ్చినా బడ్జెట్ లో అన్యాయం చేశారంటూ మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఫార్మారంగం అంటే హైదరాబాద్ అని.. అలాంటి హైదరాబాద్ కు కేటాయింపులు లేకపోవడం దారుణమన్నారు. ఎలక్ట్రానిక్ రంగం హైదరాబాద్ లో భారీ స్థాయిలో ఉందని కానీ బడ్జెట్ లో కేటాయింపులు మాత్రం చెప్పుకోతగ్గట్టు లేవని విమర్శలు గుప్పించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka). వెల్ఫేర్ కు సంబంధించి ఇంత పెద్ద బడ్జెట్ లో నిధులు ఇవ్వలేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి. జాతీయ ఉపాధిహామీ పథకానికి తూట్లు పొడిచారని.. పేదలకు ఉపాధి లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారంటూ భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.
‘మూసీ ప్రక్షాళనకు (Musi Rejuvenation) గానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా కేంద్రం నుంచి ఆశించిన నిధులు రాలేదు. సింగరేణిలాంటి రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలోనూ తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించలేదు. టూరిజం కూడా తెలంగాణలో అద్భుతంగా ఉంది. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం కూడా ఇక్కడే ఉంది. అయినా సరే ఆ రంగంలో నిధులు అనుకున్నంత రాలేదు. ఆరెంజ్ ఎకానమీలో హైదరాబాద్ సెంట్రిక్. కానీ దాన్ని కూడా ముంబైకి తరలించారు. సెమీ కండక్టర్ కు సంబంధించి నిధులు కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులందరం విజ్ఞప్తి చేశాం. ఇతర రాష్ట్రాలకు సెమీ కండక్టర్ విషయంలో నిధులు కేటాయించారు తప్ప తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వలేదు’ అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పుకొచ్చారు .
కేసీఆర్ విచారణ మీద..
మాజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ విచారణపై స్పందించాలని రిపోర్టర్లు కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘నేను ప్రస్తుతానికి విచారణ మీద స్పందించాలి అనుకోవట్లేదు. అలా చేస్తే విచారణను ప్రభావితం చేసినట్టే అవుతుంది. కాబ్టటి దాని గురించి తర్వాత మాట్లాడుతాను. ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం లేదు. ఉండదు కూడా. అత్యంత పారదర్శకంగా డెమోక్రటిక్ గా పాలన అందించాలన్నదే మా లక్ష్యం. కక్ష సాధింపు అనుకుంటే అది వారి ఆలోచన. అంతే తప్ప మాకు అటువంటి ఆలోచన లేదు. దేశ భద్రత కోసం వాడాల్సిన ఫోన్ ట్యాపింగ్ ను ఇతరుల ఆడియో కాల్స్ వినేందుకు వాడారనే ఫిర్యాదులు వచ్చాయి కాబట్టే విచారణ చేస్తున్నారు పోలీసులు’ అంటూ తెలిపారు డిప్యూటీ సీఎం.
Read Also: సిట్ విచారణలో కేసీఆర్ లక్కీ నెంబర్
Follow Us On: Instagram


