కలం, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) కేసులో కేసీఆర్ను (KCR) సిట్ (SIT) ప్రశ్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ టీమ్లోని ఆరుగురు పోలీసు అధికారులు లోతుగా ఎంక్వయిరీ చేస్తున్నారు. షెడ్యూలు ప్రకారం నందినగర్లోని కేసీఆర్ నివాసంలోని ఆదివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఈ విచారణ ప్రారంభమైంది. కేసీఆర్ లక్కీ నెంబర్ సిక్స్ అనేది బహిరంగ రహస్యం. ఆయన కారు నెంబర్గానీ, ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెట్టుకునే ముహూర్తంగానీ ఆరు అంకెతోనే ముడిపడి ఉంటాయి. చివరకు ఆయన జిల్లా పునర్ వ్యవస్థీకరణ చేసినప్పుడు కూడా ఆరు అంకె కలిసొచ్చేలా 33 జిల్లాలుగా రాష్ట్రాన్ని రీఆర్గనైజ్ చేశారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ప్రకారం ఆరుగురు పోలీస్ ఆఫీసర్లు ఎంక్వయిరీ చేస్తున్నారు. కేఎస్ రావ్, వెంకటగిరి, నారాయణరెడ్డి, శ్రీధర్, విజయకుమార్, రవీందర్ రెడ్డి అనే ఆఫీసర్లతో కూడిన టీమ్ ముందుగానే కేసీఆర్ను ప్రశ్నించాల్సిన అంశాలను సిద్ధం చేసుకున్నారు.
కేసీఆర్ ఎంక్వయిరీపై సర్వత్రా ఉత్కంఠ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు సహా హరీశ్రావు, కేటీఆర్, సంతోష్రావులను ప్రశ్నించిన సిట్ టీమ్ ఇప్పుడు బీఆర్ఎస్ అదినేత కేసీఆర్ను ప్రశ్నిస్తున్నది. వారందరూ ఇచ్చిన సమాధానాలు, అందించిన వివరాలు, వాంగ్మూలంలో వెల్లడించిన అంశాలు కేసీఆర్ విచారణలో కీలకంగా మారనున్నాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏయే సందర్భాల్లో ఏ అవసరాలకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందో కొన్ని ఆధారాలను, ఉదాహరణలను, ఫలితాలను కేసీఆర్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలిసింది. వారు చెప్పిన అంశాలకు కేసీఆర్ ఏ విధంగా స్పందించారనేది ఆసక్తికరం. రాధాకిషన్ రావ్ ఇచ్చిన స్టేట్మెంట్లోని అంశాలు కేసీఆర్ ఎంక్వయిరీలో కీలకంగా మారినట్లు సమాచారం. ఎలాగూ ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించిన వివరాల్లో పలుచోట్ల కేసీఆర్ పేరును ప్రస్తావించడంతో తాజా విచారణలో దానిపై క్లారిటీ తీసుకోవడంపై సిట్ పోలీసులు దృష్టి సారించారు.
Read Also: బడ్జెట్ ఎఫెక్ట్ : ధరలు తగ్గేవి, పెరిగేవి ఇవే..
Follow Us On: X(Twitter)


