కలం, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్లోని ఇండోర్ (Indore)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్లో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ కు చార్జింగ్ పెట్టిన సమయంలో షార్ట్ సర్క్యూట్ జరిగి భారీగా మంటలు చెలరేగాయి. రాత్రంతా బైక్ చార్జింగ్ లో ఉండటంతో బ్యాటరీ హీట్ అయ్యి బ్లాస్ట్ అయినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే భవనంలోని మూడు అంతస్తులకు మంటలు విస్తరించాయి. దీంతో భవనంలో ఉన్న మూడు గ్యాస్ సిలిండర్లు ఒక దాని తర్వాత ఒకటి పేలాయి. పేలుళ్ల ధాటికి భవనం కొంత భాగం కుప్పకూలిపోయింది. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అప్రమత్తమై బయటకు వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

