కలం, వెబ్ డెస్క్ : కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ద్వారా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. దీని ప్రకారం ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ఉచితంగా కేటాయించాలని ఆదేశించింది. దీనివల్ల ప్రయాణికులపై ఆర్థిక భారం తగ్గడమే కాకుండా పారదర్శకత పెరుగుతుంది.
ముఖ్యంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించే వారు ఒకే పీఎన్ఆర్ (PNR) నంబర్పై టికెట్ బుక్ చేసుకుంటే వారిని విడివిడి సీట్లలో కాకుండా వీలైనంత వరకు పక్కపక్కనే కూర్చునేలా చూడాలని విమానయాన సంస్థలకు స్పష్టం చేసింది. వీటితో పాటు క్రీడా పరికరాలు, సంగీత వాయిద్యాల రవాణాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరళతరమైన విధానాలను అమలు చేయాలని కేంద్రం పేర్కొంది. పెంపుడు జంతువులను వెంట తీసుకెళ్లే విషయంలో కూడా సంస్థలు స్పష్టమైన, ప్రయాణికులకు అనుకూలమైన విధానాలను రూపొందించాలని DGCA సూచించింది.
ఒకవేళ విమాన సర్వీసులు ఆలస్యమైనా, రద్దయినా లేదా బోర్డింగ్ నిరాకరించినా ప్రయాణికుల హక్కుల చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ హక్కుల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా విమానయాన సంస్థల వెబ్సైట్లు, మొబైల్ యాప్లు, ఎయిర్పోర్ట్ కౌంటర్లలో వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించింది. ముఖ్యంగా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ప్రాంతీయ భాషల్లో ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపింది.
Read Also: మూసీపై బీఆర్ఎస్ వైఖరేంటో చెప్పాలి: మంత్రి శ్రీధర్ బాబు
Follow Us On: Instagram

