కలం, వెబ్ డెస్క్ : పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు సామాన్య భక్తులపై పడుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఇంధన సంక్షోభం ఇప్పుడు కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల (Tirumala)ను తాకింది. గత కొన్ని రోజులుగా వాణిజ్య ఎల్పీజీ (LPG) సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో తిరుమలలోని అనేక ప్రైవేట్ హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు టీ షాపులు మూతపడుతున్నాయి. గ్యాస్ నిల్వలు అయిపోవడంతో నిర్వహణ సాధ్యం కాక యజమానులు తమ దుకాణాలకు తాళాలు వేస్తున్నారు.
ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు, టీ కొట్టులు పూర్తిగా మూతపడటంతో సామాన్య భక్తులకు కనీసం కాఫీ, టీలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. కొన్ని హోటళ్లు అందుబాటులో ఉన్న కొద్దిపాటి గ్యాస్తో కేవలం పరిమితమైన వంటకాలను మాత్రమే వడ్డిస్తున్నాయి. మరికొన్ని చోట్ల కట్టెల పొయ్యిలను ప్రత్యామ్నాయంగా వాడుతున్నప్పటికీ, భారీ సంఖ్యలో వచ్చే భక్తుల అవసరాలను తీర్చడం వారికి సవాలుగా మారింది. గ్యాస్ ఏజెన్సీల వద్ద సిలిండర్ల కోసం హోటల్ నిర్వాహకులు గంటల తరబడి క్యూ కడుతున్నా ఫలితం ఉండటం లేదని వారు వాపోతున్నారు.
మరోవైపు, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహిస్తున్న అన్నప్రసాద కేంద్రాలు, లడ్డూ తయారీ యూనిట్లకు ప్రస్తుతానికి ఎటువంటి ఆటంకం కలగలేదు. టీటీడీ ముందస్తు జాగ్రత్తగా తగినంత గ్యాస్ నిల్వలను ఉంచుకోవడంతో ఉచిత అన్నప్రసాద వితరణ యథావిధిగా సాగుతోంది.
Read Also: బ్లడ్లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావాలా.. భోజనం ఇలా తిని చూడండి..!
Follow Us On: X(Twitter)

