కలం, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి సీతక్క (Seethakka) అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. మహిళల సాధికారత కోసం అమలు చేస్తున్న పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా వారోత్సవాల కార్యక్రమాలు ఉండాలన్నారు. ప్రతిరోజూ వివిధ రంగాల్లో మహిళలు సాధిస్తున్న విజయాలను చాటిచెప్పే విధంగా షెడ్యుల్ రూపొందించాలని సూచించారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు మహిళా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, అధికారులు పాల్గొన్నారు.
4 వేల గ్రామాల్లో మహిళా భవనాలు..
రాష్ట్రంలో కనీసం 4 వేల గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. మహిళా సంఘ సభ్యుల విజయగాథలను ప్రజల ముందుకు తీసుకురావాలన్నారు. స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా సాధించిన ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాలు, మహిళల నాయకత్వ వికాసం, సామాజిక మార్పు వంటి అంశాలను వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహిళా సాధికారత, మహిళా విజయాల ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు.
“ఇందిరా మహిళాశక్తి” కార్యక్రమం కింద మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని మంత్రి సమీక్షించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, వ్యవసాయ, అనుబంధ, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి, వ్యాపార అవకాశాలకు సంబంధించిన కార్యక్రమాలను శరవేగంగా చేయాలన్నారు. మహిళలను ఉద్యోగార్థులుగా కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.

